Books
ప్రేమ మందిరం “Temple of Love”
Author : ఉమాదేవి అద్దేపల్లి
వేల సంవత్సరాల చరిత్ర గల మన దేశంలో ఒకప్పుడు ప్రతివిషయం ఆధ్యాత్మికతతో ముడిపడి వుండేది.అందుకే అప్పట్లో దైవ చింతన, పాపభీతి ప్రజలలో ఎక్కువగా వుండేవి. ఆధునిక విజ్ఞానం కళ్ళు తెరువని రోజుల్లోనే, విజ్ఞాన శాస్త్రానికి అందని మహోన్నత ప్రకృతిక రహస్యాలను మనవారు ఆధ్యాత్మిక శక్తితో శోధించి,సాధించారు.ప్రకృతితో సవాల్ చెయ్యకుండా ప్రకృతిక శక్తులతో మైత్రితో మసలుతూ, ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు.అందుకే ప్రకృతి సహకరించేది. దేశం సుభిక్షమై, ప్రజలు సురక్షితంగా మనగలిగేవారు. మరి నేడో! అడుగుతీసి అడుగువేస్తే,ఏ మిన్ను విరిగి మీద పడుతుందో, ఏ సునామి ఎప్పుడు వచ్చి మున్చేస్తుందో, ఎప్పుడు ప్రపంచం కుప్పగా కులిపోతుందో నని భయంతో ఛస్తూ బ్రతుకుతున్నారు ప్రజలు.
అప్పట్లో ఆధ్యాత్మికమే మనవాళ్ళకి విజ్ఞాన శాస్త్రం గా పరిగణింపబడుతుండేది. ఉదాహరణకి, బయటకు వెళ్ళి వచ్చేవారు, ముందు బయటకి వేసుకున్న బట్టలు మార్చుకొని, కాళ్ళు,చేతులు, ముఖం కడుక్కుంటే కాని లోపలి ప్రవేశించనిచ్చేవారు కాదు. ముఖ్యంగా వంటింట్లో, భోజనాల గదిలోఅడుగు పెట్టాలంటే యీ క్రమశిక్షణ పాటించవలసి వచ్చేది. దేముడి గదిలోకి అపరిశుభ్రంగా ప్రవేశిస్తే పాపం అనేవారు. అందుకే ఆ రోజుల్లో బాక్టీరియా అనేది అంతగా ప్రభలివుండేది కాదు. మడి, తడి, ఆచారాల వెనుక ఒక మహోన్నత సత్యం దాగి వుండేది. కాకపోతే, అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా, నమ్మకాలు మూడనమ్మకాలై, అసలు అర్ధాలు మరుగున పడిపోవడంతో, పెద్దల ఆచారవ్యవహారాలు తరువాత వారికీ చాధస్తాలుగా అనిపిస్తుండేవి.శరవేగంగా పరిభ్రమిస్తున్న కాలచక్ర పరిభ్రమణంలో రోజులు త్వరితగతిని మారిపోయాయి. పరాయి దేశస్తులు మనదేశాన్ని ఆక్రమించి రాజ్యమేలడం వలన, వందల సంవత్సరాలు వారి ప్రభావం మనవారి మీద పడి,మన పూర్వికుల వైశిష్టత మరుగున పడి,జీవన విధానం అర్ధ రహితంగా మారి పోయింది.దానికి తోడు వేలసంఖ్యలో మనవారు విదేశాలకు వలస వెళ్ళి,విదేశాలలో స్థిరపడినా, అక్కడ వారి నాగరికతని అలవాటు చేసుకోవాలని తంటాలు పడినా ,వారిలో తాము ఒకరు కాలేక పోవడం,ఇటు మన దేశ సంస్కృతిని పూర్తిగా ఆకళింపు చేసుకొని,ఆచరించ లేకపోవడం,వీటితో రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది మన దేశం .బ్రిటిష్ వాడు ఎక్కడవున్నా,తాను ఆంగ్లేయుడే. అమెరికన్ తాను ఎక్కడ వున్నా,తాను అమెరికనె. రష్యన్,చైనా,జపాన్ వారు ఎక్కడ వున్నా తమ జాతీయతను వదలరు,వారి భాషని,సంస్కృతిని మరువరు.భారతీయుడు మాత్రం తాను విదేశాలలో వున్నపుడు తాను భారతీయుడిగా కనిపించకుండా వుండేందుకు తంటాలు పడుతుంటాడు. ( క్షమించాలి. అందరూ అని అనడంలేదు.చాలావరకు అనడం అసమంజసం కాదనుకుంటాను )
ఒకప్పుడు ఎంతమంది మన రాజ్యాన్నికొల్లగోట్టినా,ధన సంపదలు దోచుకున్నారుకాని ,మన సంస్కృతి సాంప్రదాయాలను కాలరాయలేదు. మనవారుకుడా కొద్దో గొప్పో మన సంస్కృతిని కాపాడుకుంటూనే వచ్చారు.నేడు విదేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంకావడంతో వారితోపాటుగా మనవారే అంటు జాడ్యంలా విదేశియ సంస్కృతిని తాము తీసుకెళ్ళి మన దేశవాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. పాశ్చాత్యదేశాలు చలిదేశాలు కనుక మద్యపానం నిషేధం కాదు.ఆడ ,మగ అందరు మద్యం సేవించడం వారిజీవన విధానం.ఒకప్పుడు మనదేశంలో కొందరు మరీ నాగరికులుగా భావించేవారిలో కొందరు స్త్రీలు, కొంతయినా మర్యాద పాటించి,నాలుగు గోడల మధ్య మగవారితోసహా విదేశి మద్యం సేవించేవారు. కొంతవరకునయం.కాని నేడో ! ఆ మధ్య పేపర్లో ,టి వి ల్లో వార్తలు చూసి,ఇది నిజంగా మనదేశమేనా! అనిపించింది.హైటెక్ నగరాలుగా పేరుపొందిన నగరాలలో,నడివయసు స్త్రీలు,యువతరం కాలేజ్ అమ్మాయిలు ,ఉద్యోగినులు అందరు వారే లిక్కర్ షాపులకు వెళ్ళి వారికీ కావలసిన మద్యం కొనుక్కొని వస్తున్నారట. మద్యం దుకాణాలు స్త్రీలతో క్రిక్కిరిసి వుండడం వలన మగవారికి చోటు దొరకడం లేదట.దానికి తోడు డ్రగ్స్, విచ్చలవిడి విహారాలు, అసభ్య వస్త్రధారణ,ఇవన్ని చూస్తుంటే,ఇదేనా మన సంస్కృతి ! ఇదేనా మన నాగరికత !ఇదేనా మన పవిత్రభారతియులు ప్రవర్తించవలసిన విధానం ! అన్న ఆవేదన మనసుని కలచి వేస్తుంది.
ఏ దేశంలో లేని,ఎవరు కొల్లగొట్ట లేని అపూర్వ సంపద మనకి భగవదనుగ్రహంగా లభించినది ఒక్కటే. అదే ఆధ్యాత్మికం. ఆ పదమే నేడు అశ్లీల పదంగా ధ్వనిస్తుండడం శోచనీయం.ఆధ్యాత్మికం అనేది మతం కాదు,అదొక సిద్ధాంతం కాదు.మనది హిందూ సనాతన ధర్మం. అది సర్వధర్మ సమన్వయం.దానిని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్నదే మన భారత దేశ సంస్కృతి. మనలోనున్న మత సహనం ప్రపంచం లొ మరెక్కడా లేదు.ఎందుకంటే మన సంస్కృతి మూలాల్లో మనకి మతవాదం అనేది లేదు,మానవతావాదమే తప్ప. అందుకే సత్యం,అహింసలనే ఆయుధాలతో మాత్రమే పరాయి దేశస్తులను మనవారు పార ద్రోల గలిగారు. ఆ సత్యాహింసలకి మూలాధారం ఆధ్యాత్మికమే అని మరువ కూడదు.ఆధ్యాత్మికం అంటే తననుతాను తెలుసుకొనేందుకు దోహదం చేసేది.
నేడు అత్యంత వేగంగా అబివృద్ది చెందుతున్న విజ్ఞాన శాస్త్రం ప్రపంచ దేశాలమధ్య దూరాలను చెరిపివేయగలుగుతోంది.ప్రపంచీకరణ (గ్లోబలైజాషన్)అనేది మనదేశంలో భాషల మీద,వ్యక్తుల జీవితవిదానాల మీద ప్రభావం చూపుతోంది. అంతర్జాలం ప్రపంచాన్నంతా ఒక్కటిగా అల్లివేస్తున్నా,అది మనుష్యుల మధ్య దూరాలను చెరపగలుగుతోందే కాని మనసుల మధ్య దూరాలను చెరపలేక పోతోంది. ఆ దూరాలను చెరపగలిగేది పూలను కదంబ మాలగా,కంటికి కనబడకుండా కూర్చగలిగిన సూత్రం లాటి ఆధ్యాత్మికశక్తి మాత్రమే.
బయట ప్రపంచంలో వున్నపుడు,వారు దక్షిణాదివారు,వీరు ఉత్తరాది వారు,వారు ప్రాచ్యులు,వీరు పాశ్చ్యాత్యులు అనుకుంటారు.కాని దైవసన్నిధిలో, మందిరాలలో ఒకచోట చేరినపుడు అందరు ఒకే భక్తిభావంతో,మనం అంతా ఒకే మానవజాతి ,మనమంతా దేముని బిడ్డలం అనుకుంటాము.ఆ పవిత్ర భావన మనలో కలిగించే శక్తి ఆ ఆధ్యాత్మికతకే వుంది.దానికి వేరే మతాలు,కులాలు,గురువులు అనే పేర్లు ఆపాదించనవసరం లేదు.
ఈ సత్యాన్నిప్రాతిపాదికగా తీసుకొని వ్రాసిన నవల ‘ప్రేమమందిరం.’
ప్రాచ్యుల పరార్ధ జ్ఞానం,పాశ్చాత్యుల పదార్ధ విజ్ఞానముల అపూర్వ సంగమమయిన అంతర్జాతీయ నగరం అరో విల్ నా యీ కధకి స్పూర్తిదాయకం .అక్కడ ఈ రెండు సమపాళ్ళలో వుంటాయి.వారిది ఆధ్యాత్మిక జీవనం కాదు,వారి జీవనమేదివ్యం ( Life Divine).నేడు శ్రీ అరవిందుల పూర్ణంగవిద్యా విధానం(Integral Education) పై ప్రపంచదేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ అరవిందాశ్రమ విద్యా కేంద్రం లాటిదాన్ని కనీసం భారతదేశంలో కొన్ని ముఖ్య నగరాలలో నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ,అనేక సంవత్సరాలు ఆ విద్యాలయాన్ని,అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించి,చివరకి అది అసాధ్యమని నిరాశతో ఆ ప్రయత్నం విరమించారు. అమెరికన్ ఒకాయన ఈ విద్యాలయం పట్ల అత్యంత ఆసక్తుడై ,కాలిఫోర్నియా లొ ఒక విద్యాలయాన్ని స్థాపించి,కొంతలో కొంత ఆ సత్యచైతన్యాన్ని విద్యద్వారా ప్రరింపచేయాలని తీవ్ర కృషి సల్పుతున్నాడు.
అటువంటి ఆ మహోన్నత విద్యద్వారా ప్రభావితులైన వారిలోని మహోన్నత వ్యక్తిత్వ విశేషాన్ని,ఔన్నత్యాన్ని,ఈ ప్రపంచానికి కనీసం చూఛాయయగా నైనా తెలియజెయాలనే సంకల్పంతో,అంతర్జాతీయ విద్యాలయం విద్యార్ధినిని కధానాయికగా మలచి, ఉత్తమ విద్యావికాసాలు నేటి యువతని ఎలా సన్మార్గంలో నడపగలవు అనే సత్యాన్నికధలో ప్రతిబింబింపచేయాలని ప్రయత్నించారు రచయిత్రి.
మానవజీవన పరిణామ దశలో తరాల వారిగా మారుతున్న ,మానవ అంతరాలను తెలియజేసే మూడుతరాల కధ ఇది. పాత్రలు,సన్నివేశాలు,ప్రదేశాలు ,అన్ని కేవలం కల్పితాలు.ఎవరికీ సంబంధించినవి,ఎవర్ని ఉద్దేశించివ్రాసినవి కాదు.
మనవారే విస్మరిస్తున్న,మనదైన భారతీయ విశిష్టతని, ప్రాచీన సంస్కృతి వైభవాన్ని ప్రపంచం ఎల్లెడలా చాటిచెప్తు,పశ్చిమ దేశాల కర్మకౌశలాన్ని,వారిలోనున్న మరెన్నో విశిష్ట గుణాలను మనం స్వీకరిస్తూ,దివ్యజీవన సూత్రంతో ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబసభ్యులుగా, శాంతిసౌహార్ద్రతలతో, సోదరభావంతో కలసి మెలసి సహజీవనం సాగించాలనే శుభేచ్చతో వ్రాయబడిన నవల ఇది , ‘’ ఎమెస్కో’’ వారి ద్వారా ప్రచురింపబడి, ప్రముఖ చిత్రకారులు, విఖ్యాత సిని దర్శకులు,పూజ్యశ్రీ బాపు గారిచే ,జూలై నెలలో ఆవిష్కరణరించ బడిన ‘ప్రేమమందిరాన్ని మన తెలుగు దేశంలో ఆదరిస్తున్నట్లుగానే, ప్రవాసాంధ్రులు కూడా ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తున్నాము.
ఆధ్యాత్మికం అనే పదాన్ని ప్రయోగిస్తున్నారని , ఇదేదో పురాణ కాలక్షేపం నవల అనుకోవద్దు. పూర్తిగా సామాజిక నవల.ప్ర్రాక్ పశ్చిమాలు కధలో నాయికా,నాయకులు.’ అదే అంతర్జాతీయ ‘’ప్రేమమందిరం‘’.
గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తమ ఆధ్యాత్మిక రచనల ద్వారా ఆంధ్రులకు చిరపరిచితమైన ఉమా దేవి అద్దేపల్లి ( అరో దృతి) గారి ఈ సాంఘిక నవల మీ అందరి మన్ననలని పొందగలదని ఆశిస్తున్నాము.
కాలిఫోర్నియా ,అమెరికా, email ID, auropondy@yahoo.com
ప్రతులు లభించు స్థలములు .
Slideshow